Elephants Salute Shiva Temple : మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పరజపాడులో అద్భుతమైన, అరుదైన ఘటన వెలుగు చూసింది. గ్రామ పొలిమేరల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు స్థానిక శివాలయం వద్ద చేరుకుని కాసేపు సందడి చేశాయి. అనంతరం కైలాసనాథుడికి తొండాలు ఎత్తి భక్తితో నమస్కరించాయి. గజరాజులు భక్తితో పరమేశ్వరుడికి ప్రణామం చేస్తున్న దృశ్యాలను గ్రామస్థులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే ఏనుగులు కొద్దిసేపు ఆలయం వద్ద గడిపి, ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకోవడానికే గజరాజులు వచ్చాయని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. గజరాజులు తమ తొండాలను పైకెత్తి శివునికి నమస్కరించినట్లుగా దండం పెట్టిన దృశ్యాలు భక్తులను ఆశ్చర్యపరిచాయి. ఇటీవల విజయనగరం జిల్లా నుంచి తిరిగి మన్యం ప్రాంతంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు పలు గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా అటవీశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
Comments